న్యూఢిల్లీ: పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్య స్థాపనకు మద్దతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పాలస్తీనా పట్ల భారత్ విధానం దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. (India’s Stand on Palestine) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం ఈ విషయం వెల్లడించారు. పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్య స్థాపనకు దీర్ఘకాలంగా భారత్ మద్దతిస్తున్నదని తెలిపారు. ‘భారత విధానం దీర్ఘకాలంగా స్థిరంగా ఉంది. పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించడానికి మద్దతిస్తున్నది. సురక్షితమైన, గుర్తింపు పొందిన సరిహద్దులతో ఇజ్రాయెల్తో శాంతియుతంగా ఉండేందుకు ప్రత్యక్ష చర్చల పునరుద్ధరణను భారత్ ఎల్లప్పుడూ సమర్ధిస్తుంది’ అని అన్నారు.
కాగా, ఇజ్రాయెల్, గాజాలో మానవతా పరిస్థితి గురించి మీడియా ప్రశ్నించగా, మానవతా చట్టాన్ని పాటించడం సార్వత్రిక బాధ్యత అని అరిందమ్ బాగ్చీ తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాడాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు.
మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్ దాడుల తర్వాత పాలస్తీనా సమస్యపై భారత్ స్పందించడం ఇదే తొలిసారి. దీనికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాద దాడులను రెండుసార్లు ఖండించారు. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటామని అన్నారు.