న్యూఢిల్లీ, డిసెంబర్ 13: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను రాజేసింది. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా మరోసారి దుస్సాహసానికి తెగబడటం రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి వాస్తవధీన రేఖ సమీపంలోని 17 వేల అడుగుల పర్వతం కేంద్ర బిందువుగా ఉన్నది. భారత సైన్యానికి గట్టి పట్టు ఉన్న ఈ పర్వత ప్రాంతంపై నియంత్రణ సాధించేందుకు చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొరబడ్డాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 17 వేల అడుగుల పర్వత ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకొంటే భారత్లోని తవాంగ్ సెక్టార్లో పరిణామాలు, సైన్యం కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు అనుకూలత ఏర్పడుతుందని చైనా ఆర్మీ భావిస్తున్నది. వాస్తవానికి తూర్పు భారత్పై నిఘా పెట్టేందుకు చైనా కొన్నేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అరుణాచల్ సరిహద్దులో సైనిక గ్రామాలు నిర్మించడం, రోడ్లు వేయడం వంటి చర్యలు చేపట్టింది. తాజా ఘర్షణ నేపథ్యంలో ఈ నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. తవాంగ్ సెక్టార్కు ఆనుకొని చైనా నిర్మించిన గ్రామాలు, రోడ్లు అందులో కనిపిస్తున్నాయి.
సరిహద్దుల్లో యుద్ధవిమానాల చక్కర్లు
తాజా పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. వాస్తవధీన రేఖ వెంబడి నిఘా పెట్టింది. ఎల్ఏసీ వద్ద మరోసారి చైనా ఉల్లంఘనకు పాల్పడకుండా చేసేందుకు యుద్ధవిమానాలు అరుణాచల్ సరిహద్దు ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో తూర్పు సెక్టార్లో విన్యాసాలు నిర్వహించనున్నట్టు భారత ఎయిర్ఫోర్స్ మంగళవారం వెల్లడించింది.
35 మందికి గాయాలు..
తవాంగ్ సెక్టార్ పరిధిలో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలో 35 మంది భారత జవాన్లకు గాయాలయ్యాయని, వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని కర్నల్ అజయ్ శుక్లా వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఈ ఏడుగురిని గువాహటికి తరలించారని, ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి తనకు సమాచారం ఉన్నదని తెలిపారు. మంగవారం ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తవాంగ్ ఘటన చాలా తీవ్రమైనదని, గస్తీ విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే కాదని అన్నారు.
పరిస్థితి స్థిరంగానే: చైనా
తవాంగ్ ఘర్షణపై చైనా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బీజింగ్లో మాట్లాడుతూ భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి సాధారణంగానే ఉన్నదని అన్నారు. మరోవైపు అరుణాచల్లోని వివాదాస్పద సరిహద్దును భారత బలగాలు అక్రమంగా దాటాయని చైనా మిలటరీ బుకాయించింది. చైనా సరిహద్దు పెట్రోలింగ్ దళాలను అడ్డుకోవడం ద్వారా తాజా ప్రతిష్టంభనను సృష్టించారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఆ రోజున ఏం జరిగింది?
ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ ప్రారంభమైనట్టు సంబంధిత వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొన్నది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత సైనికులను అడ్డుకొనేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయని, అయితే దీన్ని భారత సైన్యం దీటుగా ఎదుర్కొన్నదని వెల్లడించింది. పెట్రోలింగ్ పరిధిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించడంతో ఘర్షణ రేగిందని, దాదాపు 300-400 మంది చైనా సైనికులు అక్కడకు చేరుకొన్నారని, ఆ ఏరియా నుంచి భారత జవాన్లను పంపించేందుకు బలవంతంగా నెట్టారని పేర్కొన్నది. అయితే ఆ ప్రయత్నాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడంతో చైనా బలగాలు తోకముడిచాయని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వివరించింది.