శ్రీహరికోట: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట (Sriharikota) నుంచి బాహుబలి రాకెట్గా పేరుగాంచిన మార్క్ (LVM3) ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకుపోనున్నది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ను గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కౌంట్డౌన్ను భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో (ISRO) ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగం ద్వారా 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలని శాస్త్రవేత్తలు పట్టుదలతో ఉన్నారు.
చందమామపైకి ల్యాండర్ను జారవిడిచే చంద్రయాన్ -1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో, చంద్రుడిపై రోవర్ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి పడిలేచిన కెరటంలా ఎగసిన ఇస్రో.. లోపాలను సవరించుకొని తాజాగా చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది.
ప్రొపల్షన్ మాడ్యూల్: రాకెట్ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్ ఇది. ఈ మాడ్యూల్.. రాకెట్ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది.
ల్యాండర్ మాడ్యూల్: చంద్రుడిపైకి రోవర్ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్ దిగగానే రోవర్ బయటకు వస్తుంది.
రోవర్: చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్ జీవితకాలం 14 రోజులు. రంభ-ఎల్పీ, సీహెచ్ఏఎస్టీఈ పరికరాలు వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను, నీటి జాడలను సీహెచ్ఏఎస్టీఈ గుర్తిస్తుంది.
40 రోజుల తర్వాత చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36,500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. దీనికి అతి తక్కువ ఇంధనమే అవసరం పడుతుంది. దీంతో ప్రయోగం ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.
చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ మాత్రమే విజయవంతంగా రోవర్లను దింపాయి. చంద్రయాన్-3 విజయవంతం అయితే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా, రష్యా, చైనాలు మూన్ మిషన్ కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు ఐదారు వందల కోట్ల బడ్జెట్తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపడుతున్నది.