న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించనుంది. మరికొన్ని గంటల్లో వంద కోట్ల డోసుల మార్కును చేరనుంది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో 99.7 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరి 16న కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75 శాతం వయోజనులు మొదటి డోసును, 31 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. కాగా, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న రికార్డు స్థాయిలో 2.5 కోట్ల మందికి టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
నేడు వంద కోట్లకు చేరనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 1400 కిలోల త్రివర్ణపతాకం ప్రదర్శించనున్నారు. వంద కోట్ల లక్ష్యాన్ని చేరిన వెంటనే విమానాలు, రైల్వేస్టేషన్లు, నౌకలు, మెట్రో రైళ్లలో ప్రకటించింనున్నారు. కేంద్ర ప్రభుత్వ దవాఖానల్లోనూ ప్రత్యేకంగా వేడకలు నిర్వహిస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్జెట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.