IGLA-S | భారత్-రష్యా మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగాయి. తాజాగా రష్యా ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ను భారత్కు సరఫరా చేయనున్నది. ఈ విషయాన్ని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. హ్యాండ్హెల్డ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్స్ సరఫరా కోసం ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇగ్లాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు సైతం అనుమతి ఇచ్చింది.
ఇగ్లా-ఎస్ అనేది మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPADS). శత్రువుకు సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ను ఓ వ్యక్తి సులభంగా ఫైర్ చేయవచ్చు. ఇప్పటికే ఈ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశామని, భారతీయ ప్రైవేట్ కంపెనీతో కలిసి భారత్లోనే ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా స్టేట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ రోసోబోరోనెక్స్పోర్ట్ చీఫ్ అలెగ్జాండర్ మిఖేవ్ తెలిపారు. రోసోబోరోనెక్స్పోర్ట్ ఎస్యూ-30ఎంకేఐ ఫైటర్ జెట్లు, ట్యాంకులు, సాయుధ వాహనాలు, షెల్స్ను భారత రక్షణ శాఖకు అందించినట్లు మిఖేవ్ పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో భారత్, రష్యా ఏకే-2023 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, ఇగ్లా మిస్సైల్ తయారీలో భారతీయ కంపెనీలు పాల్గొంటాయని చెప్పి.. ఆయా కంపెనీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. భారతదేశ ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 45శాతం ఉండగా.. ఫ్రాన్స్ 29శాతం, అమెరికా వాటా 11శాతం ఉన్నది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారీగా నష్టాలను చవిచూస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యంతో పాటు ఆయుధాల ప్రతిష్ట సైతం మసకబారడం గమనార్హం. అయినప్పటికీ రష్యా భారతదేశానికి అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా కొనసాగుతున్నది.