న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు (corona cases) పది వేల దిగువకు పడిపోయాయి. ఆదివారం 10 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 8 వేలకు తగ్గాయి. దీంతో ఇది నిన్నటికంటే 21.99 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మూడోవేవ్ ప్రారంభమైన తర్వాత రోజువారీ కేసులు పది వేల లోపు నమోదవడం ఇదే మొదటిసారి.
దేశంలో కొత్తగా 8013 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరాయి. ఇందులో 4,23,07,686 మంది వైరస్ నుంచి కోలుకోగా, 5,13,843 మంది మృతిచెందారు. మరో 1,02,601 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 16,765 మంది కరోనా నుంచి బయటపడగా, 119 మంది మరణించారు.
కొత్త కేసులు తగ్గిపోవడం, కోలుకునేవారి సంఖ్య పెరగడంతో యాక్టికేసులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 1,77,50,86,335 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.