న్యూఢిల్లీ: బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది. ఉగ్రవాదానికి కేంద్రంగా పేరుగాంచిన పొరుగు దేశం అలాంటి వాదనలు చేయడం సాధారణమని పేర్కొంది. బలూచిస్థాన్లోని స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో నలుగురు విద్యార్థులు సహా ఆరుగురు మరణించారని, 12 మందికి పైగా గాయపడ్డారని బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్టి మీడియాకు తెలిపారు.
కాగా, ఈ దాడిలో భారత్ ప్రమేయం ఉందని పాకిస్థాన్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) ఆరోపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిని తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలని అన్నారు. ‘ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉన్న దాని ఖ్యాతి నుంచి దృష్టిని మళ్లించడానికి, సొంత ఘోర వైఫల్యాలను దాచడానికి, పాకిస్థాన్ తన అంతర్గత సమస్యలన్నింటికీ భారత్ను నిందించడం ఆ దేశ స్వభావంగా మారింది’ అని విమర్శించారు.