న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 3081 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2415 కేసులు, ఢిల్లీ 655, కర్ణాటక 525, హర్యానాలో 327 చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,94,92,71,111 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.