India Corona | భారత్లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 6 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Minister) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,78,533 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఏకంగా 6,050 కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితో పోలిస్తే 13 శాతం ఎక్కువ. గురువారం దేశంలో 5,335 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల (Positive Cases) సంఖ్య 4,47,39,769కి చేరింది. మరోవైపు యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 28 వేల మార్క్ను దాటింది. ప్రస్తుతం 28,303 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 3,320 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,85,858కి చేరింది. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా 14 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి ఎగబాకింది.
ప్రస్తుతం దేశంలో 0.06 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Union Health Minister) తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,20,700) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలో కొవిడ్(Covid 19) కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/7ISNlOqajB pic.twitter.com/biUYx7r787
— Ministry of Health (@MoHFW_INDIA) April 7, 2023
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మంత్రులకు కొవిడ్ కట్టడిపై మార్గనిర్దేశం చేయనున్నారు. మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) సైతం హాజరుకానున్నది. దేశంలో కొవిడ్ పరిస్థితి, సంసిద్ధతపై చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.