న్యూఢిల్లీ: భారత్లో 2020లో నమోదు అయిన కోవిడ్ మరణాల్లో(Covid Deaths).. సుమారు 11.9 లక్షల మరణాలు అధికంగా రికార్డు అయినట్లు కొత్తగా చేపట్టిన సర్వే ద్వారా వెల్లడైంది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్టడీలో తేల్చారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి సంవత్సరం అదివాసీలు, దళితులు, ముస్లిం జనాభాల్లో ఎక్కువ శాతం మరణాల సంభవించినట్లు రిపోర్టులో తెలిపారు. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు తేల్చారు.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సోసియాలజిస్ట్, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీకి చెందిన ఎకానమిస్ట్ నేతృత్వంలోని బృందం ఆ స్టడీ చేసింది. ఏజ్, జెండర్, సామాజిక వ్యత్యాసం ఉన్న వారిపై కోవిడ్ వల్ల ఎటువంటి ప్రభావం పడిందన్న కోణంలో స్టడీ చేశారు. మహిళలు, అణగారిన వర్గాల వారి .. ఆయుర్ధాయం ఎక్కువగా తగ్గినట్లు అంచనా వేశారు. వివిధ సామాజిక వర్గాల్లో జీవితకాలం తగ్గిన వారిలో ముస్లింలు ఎక్కువగా ప్రభావానికి లోనైట్లు తెలుస్తోంది. ముస్లిం ఆయుర్ధాయం 5.4 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేశారు. ఆ తర్వాత జాబితాలో ఎస్టీలు 4.1 ఏళ్లు, ఎస్సీలు 2.7 ఏళ్లు తగ్గినట్లు నిర్ధారించారు. ఇక హిందువుల్లోని ఉన్నత కులాలు, ఓబీసీల వారి జీవితకాలం కేవలం 1.3 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేశారు.
2019-21 మధ్య చేపట్టిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 డేటా ఆధారంగా స్టడీ చేశారు. ఇండియాలో మహిళల ఆయుర్ధాయం 3.1 ఏళ్లు, మగవారి ఆయువు 2.1 ఏళ్లు తగ్గినట్లు భావించారు. అయితే సగటున దేశంలో జీవితకాలం 2.6 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. మహమ్మారి వల్ల ఇండియాలో మహిళలపై ఎక్కువ ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది. ఇండియాలో జరిగిన మార్పులు మరే దేశంలో నమోదు కానట్లు అంచనా వేశారు.
2020లో దేశంలోని మహిళల్లో మరణాలు 17 శాతం అధికంగా నమోదు అయినట్లు స్టడీలో తెలిపారు. ఇండియాలో అత్యధికంగా ఆయుర్దాయం తగ్గినట్లు సిటీ యూనివర్సిటీ ఎకానమిస్ట్ సంగీతా వ్యాస్ తెలిపారు.ఇండియా తరహాలోనే నల్లజాతీయులు, హిస్పానిక్స్, నేటివ్ అమెరికన్లలో కూడా జీవిత కాలం తగ్గినట్లు స్టడీలో తేల్చారు. సైన్స్ అడ్వాన్సెస్ అన్న జర్నల్లో కొత్త స్టడీకి చెందిన నివేదిక ప్రచురించారు.
అమెరికా పరిశోధకులు చేపట్టిన కొత్త స్టడీపై నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ పౌల్ రియాక్ట్ య్యారు. స్టడీ నిర్వహణలో తీవ్రస్థాయిలో తప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. మెథడాలజీ సరిగా లేదని, దాని వల్లే తప్పుడు అంచనాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. భారత్లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) ప్రకారం 99 శాతం మరణాలు రిజిస్టర్ అయినట్లు ఆయన తెలిపారు. 2019లో నమోదు అయిన మరణాల కన్నా.. 2020లో సుమారు 4.74 లక్షల మరణాలు అధికంగా నమోదు అయినట్లు ఆయన చెప్పారు. కానీ 11.9 లక్షల మంది అధికంగా మరణించి ఉంటారని ఆ స్టడీ చేసిన అంచనా ఆమోదయోగ్యంగా లేదని పౌల్ వెల్లడించారు.