Covid-19 | గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉన్న కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ రోజుకు లక్షల్లో కేసులు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్లోనూ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,179 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,428 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,695కి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 220.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.