న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్టోబర్ 1 నుంచి 21 వరకు దేశంలో 41 శాతం అధికంగా వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్, సముద్ర తీర రాష్ట్రమైన కేరళను అసాధారణ రీతిలో భారీ వర్షాలు ముంచెత్తాయని తెలిపింది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 60.2 మిల్లీమీటర్లు నమోదవాల్సి ఉండగా, 84.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని ఐఎండీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలోని 694 జిల్లాల్లో 45 శాతం అత్యధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. 96 జిల్లాల్లో 14 శాతం అధికంగా వర్షాలు కురిశాయని వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్లో వరణుడు బీభత్సం సృష్టించాడు. అక్టోబర్ 1 నుంచి 20 వరకు 192.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నది. సాధారణంగా ఈ కాలంలో 35.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉన్నది. దీంతో భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలో 54 మందికిపైగా మరణించారని తెలిపింది.
ఇక కేరళలో ఈనెల 20 నాటికి 445.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, సాధరణంగా 303.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో 40 మందికి పైగా మృతిచెందారని వెల్లడించింది. అదేవిధంగా సిక్కిం, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. దీంతో భారీఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని వెల్లడించింది.