ప్రపంచంలో 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వారిని బిలియనీర్లు అంటారని తెలుసు కదా. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, అంబానీ, అదానీ, టాటా, మహీంద్ర ఇలా మనకు తెలిసిన బిలియనీర్ల జాబితా కూడా కొంచెం పెద్దదే. ఈ జాబితాలో భారతీయుల సంఖ్య తక్కువగానే ఉంటుంది.
ఈ పరిస్థితిని మార్చేందుకు యువ వ్యాపారవేత్తలు చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి. నేటి ఆన్లైన్ యుగంలో ఒక్క ఆలోచనతో కోటీశ్వరులైపోవచ్చు. అలాంటి ఆలోచనలే ప్రస్తుతం యువత చేస్తోంది. ఈ క్రమంలో భారత బిలియనీర్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.
ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించడానికి కృషిచేసే బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్.. తాజాగా చేసిన సర్వేలో భారత్లో బిలియనీర్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత దేశంలో 2020వ సంవత్సరంలో మొత్తం 102 మంది బిలియనీర్లు ఉండేవారు. ఈ సంఖ్య 2021లో 142కు పెరిగింది.
అంటే ఒక్క ఏడాదిలోనే 40 మంది కొత్త బిలియనీర్లు భారత్లో తయారయ్యారన్నమాట. అంతేకాదు, మరో చేదు నిజం కూడా ఈ సర్వేలో బయటపడింది. భారతదేశంలోని 84శాతం కుటుంబాల ఆదాయం కరోనా మహమ్మారి ప్రారంభంతో బాగా తగ్గిపోయినట్లు తేలింది.
దేశంలోని టాప్ బిలియనీర్లలో తొలి 98 మంది మధ్య ఉన్న సంపద.. దేశంలోని 55.5 కోట్లమంది భారతీయుల వద్ద ఉన్న సంపదతో సమానమని ఆక్స్ఫామ్ వెల్లడించింది.