WEF | ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా కట్టడికి టీకాల తయారీ, పంపిణ విషయమై భారత్ అనుసరించిన విధానాన్ని వివిధ దేశాల అధినేతలు ప్రశంసించారు. భారత్ సరైన సమయంలో గణనీయంగా టీకా ఉత్పత్తి పెంచి ప్రపంచ దేశాలకు పంపిణీ చేసిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా మారే దిశగా భారత్ అడుగులు వేస్తున్నదని తెలిపారు. సమానత్వం పాటిస్తూ విస్తృత స్థాయిలో టీకాలను పంపిణీ చేయడానికి భారత్ అనుసరించిన విధానాన్ని ప్రతి దేశం పాటించాలని సూచించారు.
వ్యాక్సిన్ అలయెన్స్ గావీ సీఈవో సేత్ ఎఫ్ బెర్ల్కీ మాట్లాడుతూ టీకాను అభివృద్ధి చేయగానే ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి తీవ్రంగా కృషి చేశామన్నారు. కానీ ఆ సమయంలో జాతీయ వాదం, ఎగుమతులపై నిషేధం వంటి ఆటంకాలు ఎదురైనా క్రమంగా పరిష్కారం అయ్యాయన్నారు. ఈ దశలో విస్తృతంగా వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారత్ సంస్థల కృషి అభినందనియం అని చెప్పారు. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో కొన్ని దేశాల ప్రాధాన్యాలు వేరుగా ఉన్నా.. భారత్ సమానత్వ ప్రాతిపదికన అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గబ్రియెలా బుచర్ చెప్పారు.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ దేశంలో దారుణంగా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పుడు కేవలం రెండే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కానీ, ప్రస్తుతం పది కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయన్నారు. మరో 14 వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందన్నారు.