కేంద్రప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ సంస్థపై పోలీసుల జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర్ గురువారం ఆందోళన వ్యక్తంచేసింది. భారతదేశంలో తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. సోమవారం ఢిల్లీ, గురుగ్రామ్లోని తమ సంస్థ కార్యాలయాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించిన తర్వాత ట్విట్టర్ అధికారికంగా ప్రకటన చేయడం ఇదే తొలిసారి. భారతదేశ చట్టాలకు, సమాచార పారదర్శకతకు కట్టుబడి పనిచేస్తామని ట్విట్టర్ పునరుద్ఘాటించింది. ‘అంతర్జాతీయంగా మేం అనుసరిస్తున్న విధానాల ప్రకారమే భారత్లో కూడా సమాచార గోప్యత, భావవ్యక్తీకరణ స్వేచ్ఛలకు భంగం కలగకుండా సేవలందిస్తాం’ అని వ్యాఖ్యానించింది. కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ చట్టాలపై అభ్యంతరం తెలిపింది. వీటి వల్ల భారతదేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఉంటుందని వ్యాఖ్యానించింది.
పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ట్విట్టర్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అబద్ధమని కేంద్రం పేర్కొంది. భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది. ‘ట్విట్టర్ సహా సామాజిక మాధ్యమ సంస్థలన్నీ భారత్లో ఇప్పటివరకు భద్రంగా ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదు’ అని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రూల్స్ నిర్దేశించడానికి ట్విట్టర్ చేసిన ప్రయత్నమే ఆ ప్రకటన’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ న్యాయవ్యవస్థను ట్విట్టర్ తక్కువ చేసి చూపుతున్నదని అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ముసుగులో గుద్దులాట మాని భారతీయ చట్టాలను తప్పక పాటించాలని హెచ్చరించింది. ట్విట్టర్ కేవలం సామాజిక మాధ్యమ సంస్థ అని, ఒక దేశం ఎలా చట్టాలు చేయాలన్నదానిపై దాని సూచనలు అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.