న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని యథావిధిగా పాటించాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్లోని ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో భారత్, పాక్కు సంబంధించిన అణు కేంద్రాలు, ఖైదీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పుడు దాడుల సందర్భంగా అణు స్థావరాలపై దాడులు చేయకూడదన్న ఉద్దేశంతో 1992 నుంచి వాటి వివరాలను మార్పిడి చేసుకుంటున్నాయి.
అలాగే ఇరు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. సముద్రంలో దారి తప్పి పాకిస్థాన్ రక్షణ సిబ్బందికి చిక్కిన భారత మత్స్యకారులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయడంతోపాటు స్వాధీనం చేసుకున్న మత్స్యకారుల పడవలను కూడా అప్పగించాలని పాకిస్థాన్ను భారత్ ఈ సందర్భంగా కోరింది. అలాగే తమ దేశ జైళ్లలో ఉన్న పాకిస్థాన్ మత్స్యకారుల విడుదలకు సుముఖత వ్యక్తం చేసింది. కాగా, అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను ఇరు దేశాలు మార్పిడి చేసుకోవడం 1992 జనవరి 1 నుంచి ఇది 32వ సారి.