న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది. కాగా, కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
ఇక కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న భారత్ పిలుపు పట్ల ఆ దేశ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినట్లు తెలిపింది. దీంతో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ప్రేరేపిత, ద్వేషపూరిత నేరాలు, హింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే భారత పౌరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత పౌరులను కోరింది. ఈ మేరకు బుధవారం సూచనలు జారీ చేసింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ వెబ్సైట్ ప్రకారం కెనడాలో 2,30,000 మంది భారతీయ విద్యార్థులు, 7,00,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా.
Read More :