హైదరాబాద్, డిసెంబర్ 19 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. గడిచిన పదేండ్లలో ఆకలి భారతాన్ని మిగిల్చింది. నిత్యావసర వస్తువుల కోసం విదేశాల వైపు దీనంగా చూసే దుస్థితిని తీసుకొచ్చింది. ఉల్లి, గోధుమ, కందిపప్పు, వంట నూనె సహా అనేక ఆహారోత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు నేడు దాపురించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చక్కెర కూడా చేరింది.
చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అదే చక్కెర కోసం విదేశాలపై ఆధారపడాల్సిన దురవస్థ దాపురించింది. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది చెరుకు పంట దిగుబడి భారీగా తగ్గినట్టు పారిశ్రామికవర్గాలు పేర్కొన్నాయి. కిందటేడాదితో పోలిస్తే పంట దిగుబడి 12 శాతం (25 లక్షల టన్నులు) తగ్గినట్టు రైతులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో క్షీణత మరింత పెరుగొచ్చని అంచనా. దీంతో ఏడేండ్లలో తొలిసారిగా చక్కెర ఎగుమతులపై ఇటీవల నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం ఆంక్షలను అలాగే కొనసాగించే యోచనలో ఉన్నది. ఇదే సమయంలో రానున్న పండుగ సీజన్లో చక్కెర కొరత రాకుండా ఉండేందుకు బ్రెజిల్ నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడానికి సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, కేంద్ర సర్కారుకు ముందుచూపు లేకపోవడంతోనే దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇటీవల పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించడానికి వాటి ఎగుమతులపై 40 శాతం మేర భారీ సుంకాన్ని కేంద్రప్రభుత్వం విధించింది. గత జూన్లో టమాటా ధరలు భగ్గుమన్నాయి. దీంతో టమాటా ధరలకు కళ్లెం వేయలేకపోయిన కేంద్రం.. చివరకు నేపాల్ను ఆశ్రయించింది. దిగుమతులకు తలుపులు బార్లా తెరిచింది. ఇక, గోధుమ ధరలను నియంత్రించడానికి రష్యా సాయం తీసుకొంటున్నది. 2017 తర్వాత భారత్ గోధుమలను దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. దేశంలో కందిపప్పు కొరత అంతకంతకూ పెరుగుతున్నది. కిలో రూ. 200 దాటిన పప్పు ధరను చూసి సామాన్యులు లబోదిబోమంటున్నారు. దీంతో ధరలను అదుపుచేయడానికి తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్, మయన్మార్ నుంచి టన్నులకొద్దీ కందిపప్పును భారత్ దిగుమతి చేసుకొంటున్నది. వంటనూనె కోసం ఇండోనేషియా మీద ఆధారపడుతున్నది.
దేశీయంగా నిల్వలు తగ్గిపోతుండటంతో బియ్యం ఎగుమతులపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది. అయితే, కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ చర్యలను మాత్రం చేపట్టలేదు. దీంతో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సేకరించే బియ్యం కిందటేడాదితో పోలిస్తే 12.7 శాతం తగ్గింది. గత వానాకాలం 279.38 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించగా, ఈసారి 243.85 లక్షల టన్నులకే అది పరిమితమైంది. దీంతో విపణిలో బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.