న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతికతో భారత్ అభివృద్ధి చేసిన దివ్యాస్త్రం అగ్ని-5 క్షిపణి తొలి పరీక్ష (Agni-5 Missile Test) విజయవంతమైంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఈ ప్రయోగాన్ని సోమవారం చేపట్టింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించిన అగ్ని-5 క్షిపణిని ఒడిశా తీరం నుంచి లాంచ్ చేసింది. ఐదు వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం అగ్ని-5కు ఉన్నట్లు భారత్ పేర్కొంది.
కాగా, అగ్ని-5 క్షిపణి తొలి పరీక్షపై నిఘా నౌకలతో చైనా కన్నేసింది. క్షిపణి పరీక్ష కోసం భారత్ మార్చి 7న హెచ్చరిక జారీ చేసింది. ఆ వెంటనే చైనాకు చెందిన పరిశోధనా నౌక భారత్కు సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో తిష్ట వేసింది. విశాఖపట్నం తీరానికి 260 నాటికల్ మైళ్ల కంటే తక్కువ (సుమారు 480 కిలో మీటర్ల) దూరంలో నిఘా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01ను చైనా మోహరించింది. ఈ నౌక మార్చి 6న మలక్కా జలసంధిలోకి ప్రవేశించింది. మార్చి 8న గ్రేట్ నికోబార్ ద్వీపం, భారత ద్వీపకల్పం మధ్య కనిపించింది.
మరోవైపు 2016లో చైనా అందుబాటులోకి తెచ్చిన జియాన్ యాంగ్ హాంగ్ 01 నిఘా నౌక సుమారు 100 మీటర్ల పొడవు ఉంటుంది. 15,000 నాటికల్ మైళ్ల పరిధి, 10,000 మీటర్ల లోతు వరకు అన్వేషించే రిమోట్ సెన్సింగ్ పరికరాలు కలిగి ఉంది. అలాగే ఉపరితల ధ్వని సంతకాలను గుర్తించే సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. చైనాకు చెందిన ఇలాంటి మరో నిఘా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 03 ప్రస్తుతం శ్రీలంక తీరంలో ఉంది. గత నెలలో ఇది మాల్దీవులలో మోహరించింది.