న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్ టీవీ (సంసద్ టీవీ)ని బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున ‘సంసద్ టీవీ’ని ప్రారంభించడం మరింత సందర్భోచితంగా ఉందన్నారు. ‘ప్రజాస్వామ్యం విషయానికి వస్తే, భారతదేశ బాధ్యత పెరుగుతుంది. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదు, స్ఫూర్తి, అది ‘జీవన ధార’’ అని కొనియాడారు.
కొన్నేండ్లుగా మీడియా పాత్ర కూడా మారిపోయిందని, ఇది విప్లవాన్ని తీసుకువస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మీడియా కూడా మారడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సంసద్ టీవీ’ ఓటీటీ ప్లాట్ఫారమ్, సోషల్ మీడియాలో అందుబాటుతోపాటు యాప్ కూడా ఉంటుందని వివరించారు.