Make in India | ‘చారానా కోడికి బారానా మసాలా’ అన్నట్టు.. రూ.15 వేలు కూడా విలువ చేయని ఒక్కో ఉద్యోగం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా రూ.3 కోట్ల చొప్పున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. అంతేకాకుండా రూపాయికి 70 పైసలను సర్కారు పెట్టుబడిగా పెట్టి యాజమాన్య పగ్గాలను సదరు కంపెనీకే అప్పగించనున్నది. ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ చిప్ తయారీ సంస్థ మైక్రాన్తో కుదుర్చుకొన్న ఒప్పందం గురించి స్థూలంగా ఇదీ కథ.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘మైక్రో చిప్ తయారీ అడ్డాగా భారత్ మారనున్నది. దేశంలో మెమోరీ చిప్ల ప్రవాహం మొదలవనున్నది. 5 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇది మోదీజీ సాధించిన దౌత్య విజయం.’… గత నెలలో ప్రధాని నరేంద్రమోదీ ‘మైక్రాన్ టెక్నాలజీస్’తో ఒప్పందం చేసుకోగానే కేంద్రమంత్రులు సహా బీజేపీ పరివారమంతా గప్పాలకు పోయి చేసిన ప్రకటనలు ఇవి. అయితే, ఈ డీల్ భారత్కు నష్టదాయకమని, ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని ‘ప్యాకింగ్ ఇండియా’గా మార్చడంలో భాగమని విమర్శలు వస్తున్నాయి.
అసలేమిటీ డీల్?
చిప్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్కి రూ.22,717 కోట్లతో గుజరాత్లో కర్మాగారం ఏర్పాటు చేసేలా మైక్రాన్ టెక్నాలజీస్తో ఒప్పందం కుదిరింది. మొత్తం విలువలో 50 శాతం నిధులు అంటే రూ. 11,359 కోట్లు కేంద్రం, మరో 20 శాతం నిధులు అంటే రూ. 4,543 కోట్లను గుజరాత్ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనున్నది. 30 శాతం నిధులు అంటే రూ.6,815 కోట్లను కంపెనీ భరించాలి. కంపెనీ ఏర్పాటుతో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్రం ఆర్భాటంగా చెప్పుకొచ్చింది.
ఎంత నష్టమంటే…
కంపెనీ ఏర్పాటుకు 70 శాతం నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ, 30 శాతం నిధులను వెచ్చిస్తున్న మైక్రాన్కే యాజమాన్య పగ్గాలు దక్కనున్నట్టు ఒప్పందంలో ఉన్నది. ఈ రంగంలో ఒక్కో ఉద్యోగానికి సగటున రూ.15 వేలు వేతనంగా ఇస్తున్నారు. అంటే రూ.15 వేల జీతం వచ్చే 5 వేల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం రూ.15,902 కోట్లను ఖర్చుపెడుతున్నట్టు లెక్క. ఒక్కో ఉద్యోగానికి రూ. 3.18 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తున్నది.
కంపెనీ షరతులకు జీ హుజూర్…
9.5 శాతం సబ్సిడీకి అమెరికాలో, 40 శాతం సబ్సిడీకే జపాన్లో కంపెనీ పెట్టేందుకు మైక్రాన్ ఒప్పుకొన్నది. 70 శాతం సబ్సిడీ ఇచ్చి కంపెనీ పగ్గాలను అప్పగించాలని ఆ కంపెనీ షరతులు విధించగా, మోదీ సర్కారు ‘జీ హుజూర్’ అంటూ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
మేకిన్ ఇండియాకు తూట్లు
ఈ ఒప్పందం ద్వారా ‘మేకిన్ ఇండియా’ పథకానికి మోదీ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. ఈ ఒప్పందంలో చిప్ల తయారీ లేదు. కేవలం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్ మాత్రమే ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిప్ ‘ప్యాకింగ్’ అండ్ ‘డెలివరీ’ అన్నమాట. ఇలాంటి ఒప్పందాన్ని గొప్ప డీల్గా చిత్రీకరించడం, దీనికోసం రూ.16 వేల కోట్ల దేశ సంపదను అమెరికా కంపెనీకి కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.