న్యూఢిల్లీ: నెలకు 31 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యానికి దేశం చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాబోయే రెండు నెలల్లో నెలకు 45 కోట్ల డోస్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని రాజ్యసభలో సోమవారం అన్నారు. దేశంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం బాగా పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తగిన పరిమాణంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాల వద్ద 17 కోట్ల టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కృషితో 88 శాతం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. అలాగే 58 శాతం మంది రెండవ డోసు కూడా తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో అత్యధిక జనాభా కరోనా టీకాలు పొందారని రాజ్యసభకు వెల్లడించారు.