న్యూఢిల్లీ: గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. తక్షణమే ఆ నిషేధం అమలులోకి రానున్నది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు ఎగుమతి కోసం క్రెడిట్ లెటర్ జారీ చేసే వాటికి మాత్రమే షిప్పింగ్కు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతోంది. ఉక్రెయిన్ నుంచి ప్రపంచదేశాలకు వెళ్లాల్సిన గోధుమ నిల్వలను రష్యా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అనేక దేశాలకు గోధుల సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఈయూ దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమ ఎగుమతుల్లో టాప్ ప్లేస్లో ఉంటాయి. అయితే ఇద్దరూ యుద్ధంలో ఉన్న కారణంగా గోధుమలకు డిమాండ్ పెరిగింది.