కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఐఐటీ 54వ స్నాతకోత్సవంలో ఇవాళ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. కాన్పూర్ ప్రజలకు ఇవాళ రెండింతల సంతోషకర దినమన్నారు. ఒకవైపు కాన్పూర్ మెట్రో రైలు ప్రారంభం అవుతోందని, మరో వైపు ప్రపంచ సాంకేతిక రంగానికి ఈ నగరం నుంచి వెలకట్టలేని బహుమతులు అందుతున్నట్లు ఆయన చెప్పారు. ఐఐటీ కాన్పూర్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరంతా భయంతో ఉండి ఉంటారని, కానీ ఇప్పుడు మీరు ప్రపంచం ముందు గొప్పగా నిలిచారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీ ట్యాలెంట్ను చూపించే సందర్భం వచ్చిందన్నారు. ఉత్తమంగా రాణించే అవకాశం ఇదే అన్నారు. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండాయని, 75 యూనికార్న్లు ఉన్నాయని, స్టార్టప్లు 50 వేల దాటాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇండియాలో 50 వేల స్టార్టప్ల్లో.. గడిచిన ఆరు నెలల్లోనే పది వేల స్టార్టప్లు పుట్టుకువచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ నిలిచిందని ఆయన అన్నారు. కాన్పూర్ ఐఐటీ కాన్వకేషన్ తర్వాత మెట్రో రైలును ప్రారంభించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో సీఎం యోగి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు.