India | న్యూఢిల్లీ : దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతున్నది. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2024’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేండ్లుగా తగ్గుతున్నట్టు తెలిపింది. 1971లో గరిష్టంగా 2.2శాతంగా నమోదైన ఈ సగటు.. 2036 నాటికల్లా 0.58 శాతంకు పడిపోనున్నదని పేర్కొన్నది. దీనివల్ల దేశంలో వృద్ధుల జనాభా బాగా పెరగనున్నది. ఫలితంగా ‘ఆధారపడేవారి నిష్పత్తి’ మారనున్నది. ఇప్పటివరకూ పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా, ఇకమీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు నెలకొంటాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో పిల్లలు, యువత జనాభా ఎక్కువుండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగుభాగంలో వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనున్నది. యువ జనాభా తగ్గుముఖం పట్టి.. వయోధికులపై సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరగనున్నాయి.
కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా దేశంలో పెరిగింది. 1951లో 14.67 కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య.. 2036 నాటికి 45.67 కోట్లకు పెరగనున్నట్టు అంచనా. ఇక లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తున్నది. 2036 నాటికి ప్రతి వెయ్యిమంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని అంచనా.