న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు (Corona cases) తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శని, ఆది, సోమవారాల్లో తగ్గుతూ వచ్చిన పాజిటివ్ కేసులు రెండు రోజులుగా మళ్లీ అధికమవుతూ వస్తున్నాయి. బుధవారం 2.85 లక్షల కేసులు నమోదవగా, తాజాగా అవి మూడు లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా 350కిపైగా నమోదయ్యాయి. అయితే రెండో దశ కరోనా వేవ్తో పోల్చితే కేసులు రెట్టింపు వేగంతో నమోదవుతున్నప్పటికీ, మరణాలు మాత్రం తక్కువగా ఉండటం గమనార్హం.
దేశంలో కొత్తగా 3,17,532 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,82,18,773కు చేరాయి. ఇందులో 19,24,051 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,58,07,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,87,693 మంది బాధితులు మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 491 మంది మరణించగా, 2,23,990 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇక ఒమిక్రాన్ కేసులు 9287కు చేరాయని పేర్కొన్నది.
కాగా, ఒక్క రోజులో మూడు లక్షలకుపైగా కేసులు నమోదవడం గతేడాది మే 15 తర్వాత ఇదే మొదటిసారి. సెకండ్ వేవ్లో భాగంగా 2021, మార్చి 15న తొలిసారిగా 3,11,077 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో సెకండ్ వేవ్ ఫిబ్రవరి నెల మధ్యలో ప్రారంభమవగా, 60 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 21కి కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరింది.
అయితే మూడో వేవ్లో మాత్రం మూడు లక్షలకు చేరడానికి కేవలం 23 రోజులు మాత్రం తీసుకున్నది. దేశంలో గత డిసెంబర్ 27 నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. జనవరి 20 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
కాగా, సెకండ్ వేవ్తో పోల్చితే ప్రస్తుతం కరోనా మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. రెండో దశలో రోజువారీ కేసులు గరిష్ఠానికి చేరేనాటికి మరణాలు రెండు వేలు దాటాయి. ప్రస్తుతం మాత్రం 491గా ఉండటం విశేషం.
రోజువారీ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటకలో 40 వేలకుపైగా నమోదవగా, కేరళ 30 వేలు, తమిళనాడు, గుజరాత్లో 20 వేలకుపైగా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.