న్యూఢిల్లీ: కెనాడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో గత సోమవారం భారత సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. దాడి అమానుషమని పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కెనడా నివేదిక ప్రకారం.. గత సోమవారం బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని కిలోవ్నా పట్టణంలోగల ఓ బస్ట్స్టాప్లో 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై స్థానిక విద్యార్థులు దాడి చేశారు. అంతకుముందు బస్సులో కూడా అతడిని వేధించారు. బస్సు ఎక్కే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. సిక్కు విద్యార్థిని బస్సు ఎక్కకుండా ఆ ఇద్దరు విద్యార్థులు అడ్డుకున్నారు. అయినా అతను వాళ్లను తోసుకుంటూ బస్సులోకి వెళ్లిపోయాడు.
బస్సులోకి వెళ్లిన తర్వాత కూడా ఆ ఇద్దరు విద్యార్థులు సిక్కు విద్యార్థి కళ్లలోకి టార్చ్లైట్ వేయడం, తమ మొబైల్ ఫోన్లలో ఆ విద్యార్థిని రికార్డు చేయడం మొదలుపెట్టారు. అతను పక్కకు వెళ్లినాకొద్ది అతని దగ్గరికి వెళ్లి వేధించడం మొదలుపెట్టారు. దాంతో వారి మధ్య వాదన జరిగింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ సిక్కు విద్యార్థిని, అతనితో గొడవపడుతున్న ఇద్దరి విద్యార్థులను మందలించి కిలోవ్నా బస్టాప్లో దించేశాడు.
బస్సు దిగిన తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు సిక్కు విద్యార్థిని కాళ్లతో తంతూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి అక్కడ వైరల్ అయ్యింది. దాంతో కెనడా విద్యార్థుల తీరుపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజాగా ఇండియన్ కాన్సులేట్ కూడా స్పందించింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.