న్యూఢిల్లీ : భారత్, చైనా సరిహద్దుల్లో గత ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈస్ట్రన్ లడాఖ్లోని గోగ్రా నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత బోర్డర్లో రెండు దేశాల సైన్యాలు మోహరించాయి. రెండు దేశాల మధ్య ఇటీవల సైనిక చర్చలు జరిగాయి. తాజాగా 12వ రౌండ్ చర్చలు జరిగాయి. అక్కడ కుదిరిన ఒప్పందం ప్రకారం.. గోగ్రాలో ఉన్న తాత్కాలిక టెంట్లను రెండు దేశాల సైనికులు తొలగించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 4, 5 తేదీల్లో దళాలు శాశ్వత ప్రాంతాలకు వెళ్లాయి.
తూర్పు లడాఖ్లోని గోగ్రా ప్రాంతంలో ఉన్న దళాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆర్మీ ఇవాళ ఓ ప్రకటనలో చెప్పింది. దీంతో అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తాత్కాలిక కట్టడాలను తొలగించినట్లు ఆ ప్రకటనలో ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. 12వ రౌండ్ చర్చల ద్వారా ప్రగతి సాధించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. జూలై 31వ తేదీన చూసుల్ మోల్డోలో రెండు దేశాలకు చెందిన కార్ప్స్ కమాండర్స్ భేటీ జరిగింది. ఎల్ఏసీ వెంట.. భారతీయ ఆర్మీ, ఐటీబీపీ దళాలు శాంతికి కట్టుబడి ఉంటాయని ప్రకటనలో తెలిపారు.