న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఆ దేశానికి వ్యతిరేకంగా పలు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ను భారత్లో బ్లాక్ చేశారు. (Pak PM YouTube Channel Blocked) ఈ ఛానెల్ను సందర్శించే వీక్షకులకు ఇప్పుడు ఒక సందేశం కనిపిస్తున్నది. ‘జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఈ చర్యకు ముందు పాకిస్థాన్కు చెందిన 16 ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్ను భారత ప్రభుత్వం నిషేధించింది. డాన్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఇందులో ఉన్నాయి. సుమారు 63 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానెల్స్ భారతదేశం, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అందులో ఆరోపించారు.