Maha Rally | న్యూఢిల్లీ, మార్చి 24: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 31న విపక్షాలు ‘మహా ర్యాలీ’ నిర్వహించనున్నట్టు ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియా కూటమి అగ్రనేతలు ఈ మహార్యాలీలో పాల్గొంటారని తెలిపారు. ‘ఒక్క కేజ్రీవాల్ విషయమే కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు, దర్యాప్తు సంస్థలతో మొత్తం విపక్షాన్ని భయపెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మద్యం పాలసీ కేసులో రెండేండ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఒక రూపాయైనా రికవరీ చేశారా? అని ప్రశ్నించారు. ఇదే మద్యం పాలసీ కేసులో అరెస్టయిన శరత్చంద్రా రెడ్డిని.. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.60 కోట్ల విరాళం అందజేయడం ద్వారా విడుదల చేశారని ఆరోపించారు.
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఆయన తొలిసారిగా పాలనపరమైన ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి సరఫరా, మురుగు నీరు సమస్యల పరిష్కారానికి సంబంధించి ఢిల్లీ నీటి వనరుల శాఖ మంత్రి ఆతిశీకి పలు సూచనలతో కూడిన నోట్ను పంపించారు. తనకు సీఎం కేజ్రీవాల్ నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని మంత్రి ఆతిశీ ఆదివారం వెల్లడించారు. ఆ నోట్ను చదువుతుంటే తనకు కండ్లలో నీళ్లు వచ్చాయని, తాను ఇబ్బందులు పడుతున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కేజ్రీవాల్ నిత్యం తపిస్తున్నారని పేర్కొన్నారు.