బెంగళూరు: సెక్యులరిజాన్ని జోక్గా మార్చే గ్రూపుల సమూహం ‘ఇండియా’ బ్లాక్ అని కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) విమర్శించారు. దీనికి పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. గతంలో అటల్ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. అలాగే తమిళనాడులోని డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తండ్రి ఎం కరుణానిధి ఆరేళ్లుగా బీజేపీలో ఉన్నారని, ఆయన అల్లుడు కూడా నాటి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని తెలిపారు. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపారని చెప్పారు. ఇలాంటి అనేక సందర్భాలను తాను ఉటంకించగలనని అన్నారు. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ బ్లాక్ పరిణామాలు లౌకికవాదం నిజమైన అర్థానికి సరిపోవని దుయ్యబట్టారు.
కాగా, అటల్ వాజ్పేయి కంటే ప్రధాని మోదీ భిన్నమైన వ్యక్తి అని హెచ్డీ దేవెగౌడ కొనియాడారు. వాజ్పేయి నేతృత్వంలో 180 ఎంపీ సీట్లను బీజేపీ దాటలేకపోయిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో బీజేపీకి 282 సీట్లు వచ్చాయని, ఎన్డీయే భాగస్వాములతో కలుపుకుంటే మొదటి టర్మ్లో 350 పైగా సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 400 సీట్లు దాటాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ నాయకత్వం భారత్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు పొందిందని దేవెగౌడ ప్రశంసించారు. అదే సందర్భంలో పార్లమెంట్లో రెండు దఫాలుగా ప్రతిపక్ష గుర్తింపైనా కాంగ్రెస్ పార్టీ పొందలేకపోయిందని విమర్శించారు.