Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉండగా.. ఇందులో మూడింట ఒకవంతు జనాభా భారత్, చైనాలోనే నివసిస్తున్నది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని దాదాపు 200 దేశాల్లో 804.5 కోట్ల మంది నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తెలిపింది. 142.86 కోట్ల జనాభాతో భారత్ తొలి స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. భారత్ కంటే దాదాపు 29 లక్షల తక్కువ జనాభాతో చైనా (142.57 కోట్లు) రెండో స్థానంలో ఉన్నట్టు వివరించింది. ఈ మేరకు జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరిట బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలెట్టాక ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలోకి రావడం గమనార్హం.
ప్రపంచంలోని మొత్తం జనాభాలో మూడింట ఒకవంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉన్నట్టు నివేదిక అంచనా వేసింది. గడిచిన కొన్నేండ్లుగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్లో ఇది నెమ్మదించినట్టు నివేదిక అభిప్రాయపడింది. గడిచిన ఏడాదిలో భారత్ జనాభాలో 1.56 శాతం పెరుగుదల నమోదైనట్టు లెక్కగట్టింది. భారత్లోని మొత్తం జనాభాలో 68 శాతం 15-64 ఏండ్ల మధ్యవారేనని నివేదిక తెలిపింది. 15-24 మధ్య వయస్కులైన యువత జనాభా 21.5 కోట్లని వెల్లడించింది. సంతానోత్పత్తి రేటు సగటున 2గా లెక్కగట్టింది. ప్రజల సగటు ఆయుర్దాయం పురుషులకు 71 ఏండ్లుగా, మహిళలకు 74 ఏండ్లుగా తెలిపింది.
జనాభాలో భారత్ అగ్రస్థానం చేరుకోవటంపై చైనా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జనాభా ప్రయోజనాలు క్వాంటిటీ (సంఖ్యా బలం) మీద ఆధారపడవు. క్వాలిటీ (నాణ్యత, సామర్థ్యం) మీద ఆధారపడి ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చైనా జనాభా 140 కోట్ల పైమాటే. ఇందులో పనిచేసే వారి (శ్రామిక శక్తి) సంఖ్య దాదాపు 90 కోట్లు. మా జనాభా డివిడెంట్ (ప్రయోజనం) అదృశ్యమైపోలేదు. అది వృద్ధి చెందుతూ అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నది’ అని వెన్బిన్ అన్నారు.