న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న కొందామంటెనో జేబుకు చిల్లు పడ్తది.. వద్దనుకుంటెనో కడుపు మాడుతది.. ఇదీ ప్రస్తుతం దేశంలో సామాన్య ప్రజల పరిస్థితి.. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో సామాన్యుడి బడ్జెట్ అంచనాలు తప్పుతున్నది. నెలవారీ ఖర్చు తడిసి మోపెడవుతున్నది. కేంద్రంలోని మోదీ సర్కారు ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్పై 294 శాతం, డీజిల్పై 612 శాతం సుంకాలు పెంచింది. దీంతో ఇంధన భారం రెట్టింపయింది. రవాణా ఖర్చు పెరిగింది. తదనుగుణంగా నిత్యావసరాల ధరలూ భారీగా పెరిగాయి.
మరింత పెరుగొచ్చు..
మూడు, నాలుగు నెలలుగా తమ నెలవారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 92 శాతం మంది తమ నెలవారీ ఖర్చులు పెరిగినట్టు చెప్పారు. 55 శాతం మంది ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నెల ఖర్చులు రాబోయే మూడు నెలల్లో 10-30% దాకా పెరగవచ్చని పేర్కొన్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 323 జిల్లాల్లో 23,500 మందిని ధరలపై ప్రశ్నించింది.