న్యూఢిల్లీ, మార్చి 19: ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు అభ్యర్థులు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తారు. ‘జో జీతా వోహీ సికందర్’ అన్నట్టుగా గెలవడానికి ఎలాంటి ఎత్తులైనా వేస్తారు. ఇలా ప్రత్యర్థులు వేసే ఎత్తులను గుర్తించి ఎదుర్కోవడం ప్రతి అభ్యర్థికీ సవాల్ లాంటిది. అందుకే, ఈ బాధ్యతలను ఇప్పుడు పలువురు అభ్యర్థులు ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కదలికలపై ఒక కన్నేసి ఉంచే బాధ్యతను ఈ సంస్థలకు ఇస్తున్నారు. తద్వారా ప్రత్యర్థి బలాలు, బలహీనతలు, రహస్యాలు, ఎన్నికల క్షేత్రంలో అవలంబించబోతున్న ప్రణాళికలు అన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలకు డిమాండ్ పెరిగింది.
ప్రత్యర్థుల డబ్బు, మద్యంపై నిఘా
ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే తమకు కొందరు అభ్యర్థులు పని అప్పగించారని ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలు చెప్తున్నాయి. ప్రత్యర్థుల క్రిమినల్ రికార్డులు, అవినీతి ఆరోపణలు వంటివి తెలుసుకుంటున్నారట. ఇందుకు గానూ ప్రైవేటు ఏజెన్సీలు ఆర్టీఐని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకున్నాయట. ఎన్నికల్లో కీలకంగా మారిన డబ్బు, మద్యం పంపకం వ్యవహారాన్ని గుర్తించే బాధ్యతను కూడా కొందరు అభ్యర్థులు ప్రైవేటు నిఘా సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రధానంగా డబ్బు, మద్యాన్ని ఎక్కడ దాచారో గుర్తించే పనికి పురమాయిస్తున్నారని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సిటీ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజీవ్ కుమార్ చెప్తున్నారు.
సొంత నేతలపైనా కన్ను
ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థులే కాదు సొంత పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారు, అనుమానం ఉన్న అనుచరులపై కూడా కొందరు అభ్యర్థులు నిఘా పెడుతున్నారట. వీరు తమ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందిస్తూ వారి చేతుల్లో అస్ర్తాలుగా మారుతున్నారా అనేది తెలుసుకునేందుకు వీరి కదలికలపై దృష్టి సారించేలా ప్రైవేటు డిటెక్టివ్లకు పని అప్పగిస్తున్నారట. అభ్యర్థులే కాకుండా పార్టీలు కూడా కొన్ని డిటెక్టివ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల బ్యా గ్రౌండ్ వెరిఫికేషన్, నియోజకవర్గాల్లో వారికి వాస్తవంగా ఉన్న బలాలను గుర్తిం చి నివేదిక ఇచ్చే బాధ్యతను పార్టీలు అప్పగిస్తున్నాయని స్లీత్స్ ఇండియా అనే డిటెక్టివ్ ఏజెన్సీ ఎండీ నమన్ జైన్ తెలిపారు.