Dravid on BJYM Meet | అధికార బీజేపీ అనుబంధ యువమోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశానికి తాను హాజరు కావడం లేదని టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశారు. ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని కొట్టి పారేశారు. గురువారం నుంచి ఈ నెల 15 వరకు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో బీజేపీ యువమోర్చా నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు. ఈ సదస్సులో టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పాల్గొంటారని స్థానిక ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా సోమవారం చెప్పారు. అంతే కాదు.. ఆయన పాల్గొని మాట్లాడటం వల్ల యువతకు సందేశం ఇచ్చినట్లవుతుందని కూడా అన్నారు.
త్వరలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేవైఎం నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రాహుల్ ద్రావిడ్ హాజరవుతారని వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ కథనంపై ద్రావిడ్ రియాక్టయ్యారు. ఈ నెల 12-15 మధ్య హిమాచల్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఒక వర్గం మీడియాలో వార్తలు వచ్చాయని, అవన్నీ నిజం కాదని కొట్టి పారేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44, కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.