Dana cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, క్రమంగా తుఫాన్ రూపు సంతరించుకుంటోంది. ఈ తుఫాన్ ఈ నెల 24న ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్కు ఇప్పటికే దానా తుఫాన్ అని నామకరణం చేశారు. ‘దానా’ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దాంతో మూడు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ‘దానా’ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్పై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి. ఎక్కడికక్కడ విపత్తు నిర్వహణ దళాలను మోహరించాయి.
దానా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పర్బా మందిర్, మేదినీపూర్, పశ్చిమ మిడ్నాపూర్, ఝాగ్రామ్, బంకూర, హుగ్లీ, హౌరా, కోల్కతా జిల్లాల్లోని స్కూళ్లకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 26 వరకు సెలవు ప్రకటించింది.