(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు అసలు నిజాలను దాస్తున్నదని రుజువైంది. స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్తో తమకెలాంటి లావాదేవీలు జరుగలేదంటూ గతంలో రక్షణశాఖ చేసిన ప్రకటన అవాస్తవమని తేటతెల్లమైంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇలా భారత్లోనే వివిధ రంగాలకు చెందిన 300 మందికి పైగా ఫోన్ల హ్యాకింగ్ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి మోదీ సర్కారు కుట్రకు పాల్పడినట్టు తేలింది. ఈ మేరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) సంచలన నివేదికను తాజాగా బయటపెట్టింది.
ఇండియన్ ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సరఫరా చేసేందుకు మోదీ సర్కారు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో 2017లో ఓ ఒప్పందం కుదుర్చుకున్నది. దీని విలువ రూ. 15 వేల కోట్లు. ఆ ఏడాది ఏప్రిల్లో పూర్తయిన ఈ డీల్లో భాగంగా భారత్కు క్షిపణులతో పాటు పెగాసస్, దాన్ని వినియోగించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ను అందజేయడానికి ఇజ్రాయెల్ సర్కారు ఒప్పుకొన్నది. ఈ క్రమంలో 2017, ఏప్రిల్ 18న ఎన్ఎస్వో గ్రూప్ నుంచి ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కార్యాలయానికి కార్గో విమానంలో కొంత ఎక్విప్మెంట్ సరఫరా అయింది. దీని విలువ రూ. 2 కోట్లు. పెగాసస్ వంటి క్లిష్టమైన స్పైవేర్లను వాడేందుకు ఈ ఎక్విప్మెంట్ను వినియోగిస్తారు. ఈ హార్డ్వేర్ను ఐబీ తీసుకొన్నట్టు ఓసీసీఆర్పీ నివేదిక సాక్ష్యాలతో సహా ప్రచురించింది. డెలివరీ రసీదులను కూడా బయటపెట్టింది. ఎక్విప్మెంట్లో డెల్ కంప్యూటర్ సర్వర్లు, సిస్కో నెట్వర్క్ ఎక్విప్మెంట్, అన్ ఇంటరప్టెడ్ పవర్ సైప్లె బ్యాటరీలు ఉన్నట్టు బిల్స్తో సహా ప్రచురించింది. ఈ ఎక్విప్మెంట్ బాక్స్ మీద ‘డిఫెన్స్ అండ్ మిలిటరీ యూజ్’ అని రాసినట్టు వివరించింది. కాగా అధునాతన ఆయుధాలు, సాంకేతికత మార్పిడిలో భాగంగా ఇజ్రాయెల్తో భారత్ రూ. 15 వేల కోట్ల ఒప్పందం చేసుకొన్నట్టు అప్పుడు కేంద్రం చెప్పింది. అయితే, క్షిపణులతో పాటు పెగాసస్, దాని వినియోగానికి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా ఈ డీల్లో భాగంగా మోదీ సర్కారు కొనుగోలు చేసినట్టు తాజాగా వెల్లడైంది.
ఐబీ దిగుమతి చేసుకొన్న ఎక్విప్మెంట్తోనే పెగాసస్ను వినియోగించారో లేదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉన్నదన్న ఓసీసీఆర్పీ.. 2017లో మోదీ సర్కారు పెగాసస్ను కొనుగోలు చేసినట్టు ఐబీకి చెందిన అధికారులు ధ్రువీకరించినట్టు వెల్లడించింది. కాగా, పెగాసస్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. గత ఆగస్టులో నివేదికను ఇచ్చిన కమిటీ.. కొందరి ఫోన్లలో మాల్వేర్ను గుర్తించామని, అయితే అది పెగాసస్ అవునా? కాదా? తేలాల్సి ఉన్నదని చెప్పింది. పెగాసస్ గూఢచర్యం దర్యాప్తులో కేంద్రం సహకరించలేదని కమిటీ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.