న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గడిచిన రెండు శతాబ్దాల్లో యమునా నది ప్రవాహం, వెడల్పు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జియోగ్రఫీ శాఖ, భోపాల్లోని సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఒకవైపు ఢిల్లీ నగరం విస్తరిస్తుండగా, యమునా నది మాత్రం ఆ సిటీ సమీపంలో క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. 1799 నాటి మ్యాప్ ఆధారంగా ఈ అంచనా వేశారు. శాటిలైట్ ఇమేజ్లు, చారిత్రక రికార్డులను అధ్యయనం చేశారు. గడిచిన 225 ఏళ్లలో యమునా నది ఢిల్లీ సమీపంలో 68 శాతం తన వెడల్పును కోల్పోయిందని, ఇక సిటీకి ఆ నది ద్వారా చేరుతున్న నీరు కూడా 89 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
తాజేవాలా, ఓక్లా, వజీరాబాద్, ఐటీవో వద్ద బ్యారేజీలను నిర్మించడం వల్ల ఢిల్లీ చేరే నీటి సామర్థ్యం తగ్గినట్లు తేల్చారు. మరో వైపు నగరంలో వేగంగా జనాభా పెరగడం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. 19వ శతాబ్ధం ఆరంభంలో కేవలం రెండు లక్షలు ఉన్న ఢిల్లీ జనాభా.. ఇప్పుడు 2.15 కోట్లకు చేరుకున్నట్లు స్టడీలో తెలిపారు. దీంతో భూమి, నీటి కోసం ఢిల్లీలో డిమాండ్ పెరిగిపోయిందన్నారు. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం కొండల్ని తొవ్వడం వల్ల.. బఫర్ జోన్లుగా ఉండే సుమారు 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం ఇప్పుడు నీటి కొరతతో బాధపడుతోంది.
యమునా నది మధ్య భాగంలో ఇసుకతో నిండిన ప్రాంతం 1985లో సుమారు 20 చదరపు కిలోమీటర్లు ఉండేదని, కానీ 2020 నాటికి ఆ విస్తీర్ణం 4 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తెలిపారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత ఏర్పడినట్లు రిపోర్టులో చెప్పారు. భవిష్యత్తులో వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడుకోవాలంటే, యమునా నది సహజ ప్రవాహాన్ని పెంచాలన్న అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు.