విజయవాడ: మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరం ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. పాశ్చాత్య భావజాలంలో కూరుకున్న కొందరు మన దేశ ఎదుగుదలను చూసి ఓర్వకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీరు చేపడుతున్న దేశ వ్యతిరేక ప్రచారం ఆందోళనకరమని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ పుస్తకం తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ పుస్తకాన్ని బుధవారం విజయవాడలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి మాట్లాడారు.
శాంతి, అహింసలు భారతీయుల రక్తంలోనే ఉన్నాయని, మనపై జరిగిన దండయాత్రలను ప్రతిఘటించడమే తప్ప.. బలప్రదర్శన కోసం ఇతరులను కవ్వించే వ్యక్తిత్వం భారతీయులది కాదని వెంకయ్యనాయుడు చెప్పారు. మన దేశం ఇప్పటి వరకు ఏనాడూ విస్తరణ కాంక్షతో, సరిహద్దులను పెంచుకోవాలనే లక్ష్యంతో విదేశాలపై దండయాత్రలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు. భారతదేశం మొదటి నుంచి విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తున్నది చెప్పారు. ‘దేశంలోని నలు దిక్కులా పది, పన్నెండు నగరాలను సందర్శించిన విల్ దురంత్.. భారతీయుల పట్ల ఆంగ్లేయులు వ్యవహరించిన తీరును చూసి విస్మయం చెందారన్నారు. భారతదేశ ఘనమైన చరిత్రను పాశ్చాత్యులు సృష్టించిన అసత్యాలు, అర్ధసత్యాలు దృష్టికోణంలో కాకుండా, నిజమైన భారతీయ దృష్టి కోణంలో తిరిగి లిఖించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, సిద్ధార్ధ అకాడమి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, అలకనంద ప్రచురణకర్త డీ అశోక్ కుమార్, రచయిత్రి శ్రీమతి నాదెళ్ళ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
జగన్నాథాష్టకం సీడీ ఆవిష్కరణ
శ్రీ జగన్నాథ స్వామి తత్వాలను వివరిస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కుమారుడు ప్రసేన్ జిత్ హరిచందన్ నేతృత్వంలోని ‘డివైన్ క్యాప్సూల్’ సంస్థ తీసుకొచ్చిన ‘జగన్నాథాష్టకం’ సీడీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీని తీసుకొచ్చేందుకు శ్రమించిన ప్రసేన్ జిత్ హరిచందన్, గాయకుడు సురేశ్ వాడేకర్, సంగీత దర్శకుడు జగ్యాన్ దాస్తో పాటు టెక్నీషియన్స్ అందరినీ అభినందించారు.