చెన్నై: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం జరిగింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో.. ఓ స్కూల్ విద్యార్థిని తన పుట్టిన రోజు సందర్భంగా క్లాస్మేట్స్కు చాక్లెట్లు(Birthday Chocolates) పంచి పెట్టింది. అయితే ఆ చాక్లెట్లు తిన్న తోటి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 21 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. చక్కరపురంలో ఉన్న పంచాయ్ యూనియన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి స్టూడెంట్ తన పుట్టిన రోజు సందర్భంగా క్లాస్మేట్సకు చాక్లెట్లు పంచింది. ఆ చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. చాక్లెట్లు తిన్న వెంటనే 11 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆ స్కూల్ టీచర్లు వెంటనే విద్యార్థులను గింజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు అక్కడ చికిత్స జరుగుతోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలా గోపాల్ ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.