చెన్నై: గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆచారం ప్రకారం భక్తులు శివుడికి సమర్పించిన నిమ్మకాయలు, పండ్లతోపాటు ఇతర వస్తువులను వేలం వేశారు. ఈ వేలంలో సుమారు15 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్కు చెందిన ఒక భక్తుడు ఒక నిమ్మకాయను రూ.35,000కు వేలం పాటలో దక్కించుకున్నాడు.
కాగా, వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి దేవుడి ముందు ఉంచి పూజ చేశారు. అనంతరం ఆ నిమ్మకాయను వేలంలో పాడుకున్న వ్యక్తికి అందజేశారు. అయితే ఆలయంలో జరిగే వేలం పాటలో నిమ్మకాయ పొందిన వారు దేవుని ఆశీసులతో ధనవంతులు, ఆరోగ్యవంతులవుతారని ఆ ప్రాంత భక్తుల నమ్మకం. అందుకే వేలంలో నిమ్మకాయను దక్కించుకునేందుకు పోటీ పడతారు.