Rajastan Political Crisis | అగ్ర కులాలు ఉపయోగించే కుండలో నీళ్లు తాగిన దళిత బాలుడిపై టీచర్ దాడి చేయడంతో గాయాలతో చికిత్స పొందుతూ గతవారం మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ సర్కార్కు ప్రాణ సంకటంగా మారింది. దళిత బాలుడి మరణం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. `రాజస్థాన్లోని దళితులకు న్యాయం చేయాలని గెహ్లాట్కు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడు సూచిస్తారు` అని రాష్ట్ర బీజేపీ ట్వీట్ చేసింది. ప్రతిపక్ష బీజేపీతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్కు సొంత కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొమ్మిదేండ్ల దళిత బాలుడి మృతి వల్ల తన మనస్సు తీవ్రంగా గాయపడిందని పేర్కొంటూ బరన్ అత్రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సీఎం గెహ్లాట్కు పంపారు. కుల సంబంధ నేరాలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై త్వరిగతిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్.. జలోర్ జిల్లాలోని సంబంధిత బాలుడి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. జలోర్ వంటి దుర్ఘటనలకు చరమ గీతం పాడుదామన్నారు. తామంతా దళిత సామాజిక వర్గం వెనుకాలే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. దీన్ని రాజకీయం చేయబోమని కూడా చెప్పారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా, సీనియర్ మంత్రులు కూడా జలోర్ వెళ్లి.. బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.
గత నెల 20న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న తొమ్మిదేండ్ల దళిత బాలుడు.. ఉన్నత కులాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కుండ నీటిని తాగడం టీచర్ చూసి తీవ్రంగా కొట్టడంతో కన్ను, చెవికి గాయాలయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో గల దవాఖానలో చేర్చారు. కానీ, చికిత్స పొందుతూ గతవారం మరణించాడు. విద్యార్థిపై దాడి చేసిన టీచర్ను అరెస్ట్ చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యా నేరం కింద కేసులు నమోదు చేశారు.