భోపాల్: కొందరు దుండగులు ఒక చర్చికి నిప్పుపెట్టారు. లోపలి గోడలపై మతపరమైన రాతలు రాశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. గిరిజనులు ఎక్కువగా నివసించే నర్మదాపురం జిల్లా చౌకీ పురా గ్రామంలో క్రైస్తవ ప్రార్థనా మందిరం ఉంది. ఐదేళ్ల కిందట నిర్మించిన ఈ చర్చి వద్దకు ఆదివారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వచ్చారు. కిటికీ తెరిచి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. మరి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. చర్చి లోపలి గోడలపై ‘రామ్’ అని హిందీలో రాశారు. సోమవారం ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో మరో వివాదస్పద సంఘటన సోమవారం జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి ఇంట్లోకి కొందరు బలవంతంగా చొరబడ్డారు. ఆ ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ వివాదానికి ప్రధాన నిందితుడు హిందూ నాయకుడు రవి అవద్ అని పోలీసులు తెలిపారు.