లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు ఆయనకు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ కాలంలో ఉత్తరప్రదేశ్ లేదా ఢిల్లీలో ఆయన ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021 అక్టోబర్ 3న లఖింపూర్లో రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని వాహనం దూసుకెళ్లింది. కొందరు రైతులను తొక్కివేసింది. ఈ సంఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ మరణించారు. ఆగ్రహించిన రైతులు పలు వాహనాలను నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో ఒక వాహనం డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.
కాగా, ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రైతుల ఆందోళనలు, సుప్రీంకోర్టు చీవాట్లతో యూపీ ప్రభుత్వం దిగివచ్చింది. హింసాకాండ జరిగిన ఆరు రోజుల తర్వాత 2021 అక్టోబర్ 9న అజయ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఏడాదిపైగా జైలులో ఉన్న ఆయనకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ నెల 25న మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అయితే అనూహ్యంగా అజయ్ మిశ్రా బెయిల్ అభ్యర్థనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ‘ఇది ఘోరమైన, హేయమైన నేరం. ఆయన విడుదల సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుంది’ అని ఉత్తరప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమ ప్రసాద్ సుప్రీంకోర్టుకు తెలిపారు.