E20 petrol : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలు పాడవుతున్నాయంటూ ఆందోళన చేశారు. అంత తొందరగా ఈ20 పెట్రోల్ వినియోగాన్ని ఎందుకు తెచ్చారంటూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఇది ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన తొలి నిరసన.
‘హమారా గాడి, హమారా అధికార్’ అంటూ కార్ ఓనర్లు ఈ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో టీవీ నటుడు, వ్యాపారి తెహ్సీన్ పూనావాలా సహా పలువురు ప్రముఖులు, ఆటో మొబైల్ నిపుణులు, చమురు రంగ నిపుణులు పాల్గొన్నారు. తమలో కొందరు బీజేపీ మద్దతుదారులు కూడా ఉన్నారని, నిష్పక్షపాతంగా ఈ నిరసన చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. ఈ20 పెట్రోల్ వల్ల తమ కార్ల మైలేజీ తగ్గుతోందన్నారు. వాహనాలు ఉన్నట్లుండి ఆగిపోతున్నాయని, మైలేజీ దారుణంగా తగ్గుతోందని, ఫ్యుయల్ ఫిల్టర్లు పాడవుతున్నాయని, వీటి వల్ల కార్లకు భారీగా రిపేర్లు చేయించాల్సి వస్తోందని అన్నారు. వీటికి సంబంధించి తాము ఎదుర్కొన్న అనుభవాల్ని ఆందోళనకారులు వివరించారు. ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే చెరుకు కావాలి. ఈ చెరుకు నుంచి చక్కెర వస్తుంది. చక్కెర ఉత్పత్తి చేసే పరిశ్రమల నుంచి లభ్యమయ్యే ఇథనాల్ వాడకం వెనుక ఆయా పరిశ్రమల లాబీ నడుస్తోందని వారు విమర్శించారు.
కేంద్రం ఈ20 పెట్రోల్ వినియోగం విషయంలో మొండిగా వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డీజిల్ను కూడా ఐసోబ్యూటనాల్తో మిక్స్ చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా.. కేంద్రం ఈ విషయంలో వెనకడుగు వేసేలా కనిపించడం లేదు.