Farmers | న్యూఢిల్లీ: పంటలకు మద్దతు ధరపై చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు తదితర డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు దూసుకొచ్చిన వేల మంది అన్నదాతలను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులకు సరికొత్త ఆయుధాలను అందజేసింది. రైతుల ఆందోళనను భగ్నం చేయడానికి వారి కర్ణభేరిని పగులగొట్టడమే పరిష్కారం అని ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే పోలీసులు ఈసారి దీర్ఘశ్రేణి అకౌస్టిక్ పరికరాలు (ఎల్ఆర్ఏడీ) లేదా అల్లరి మూకలను నియంత్రించే శబ్ద ఫిరంగులను సరిహద్దుల్లో మోహరించారు. ఈ పరికరాలు ఒకే దిశగా భారీ స్థాయిలో ధ్వనిని విడుదల చేస్తాయి.
ఆ ధ్వని ధాటికి నిరసనకారులు తమ వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఎల్ఆర్ఏడీలను అమెరికా సైన్యం 2000 సంవత్సరంలో తయారుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు 2013లో ఒక్కో దానికి రూ.30 లక్షలు వెచ్చించి ఐదు ఎల్ఆర్ఏడీలను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. రైతులు సైతం పోలీసుల దాడులను భగ్నం చేసేందుకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు. పోలీసులు డ్రోన్ల సాయంతో రైతులపైకి పొగబాంబులను జార విడుస్తుండగా.. డ్రోన్లను నేలకూల్చేందుకు రైతులు పతంగులను ఎగురవేయడం గమనార్హం.