రాయ్పూర్: బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకిస్తూ ఒక చర్చిపై దాడికి స్థానికులు ప్రయత్నించారు. అడ్డుకునే యత్నంలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నారాయణపూర్లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఆదివాసీ వర్గం సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. తొలుత కుర్చీలు, రాళ్లు విసురుకున్నారు. అనంతరం కర్రలతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా విశ్వ దీప్తి క్రిస్టియన్ స్కూల్ ప్రాంగణంలోని చర్చిపై దాడికి ఒక వర్గం ప్రయత్నించింది.
మరోవైపు సమాచారం అందుకున్న నారాయణపూర్ ఎస్పీ సదానంద్, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. స్థానికులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కర్రతో దాడి చేయడంతో ఆయన తలకు గాయమై రక్తం కారింది. దీంతో ఎస్పీ సదానంద్ కుమార్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి అదనపు పోలీసులను తరలించారు. నిరసనలు, ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు.