కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు కోసం ఈ నెల 29న తమ కార్యాలయానికి రావాలంటూ గురువారం నోటీసులు పంపింది. అయితే అభిషేక్ బెనర్జీతోపాటు ఆయన భార్య, మరికొందరికి ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో వారు ఈ నెల 21న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా 34 ఏండ్ల అభిషేక్ బెనర్జీని ఈడీ అధికారులు సుమారు 8 గంటలపాటు రహస్యంగా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కొత్త కార్యాలయానికి సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్లిన ఆయన రాత్రి 8 గంటలకు బయటకు వచ్చారు.
కాగా, కోల్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఈడీ, అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలిపింది. దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలపై ఆయనను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. అయితే కొంత వ్యత్యాసం ఉండటంతో అభిషేక్ బెనర్జీని మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో ఈ నెల 29న తమ కార్యాలయానికి రావాలంటూ తాజాగా గురువారం సమన్లు జారీ చేసింది.
మరోవైపు ఈడీ దర్యాప్తుపై అభిషేక్ బెనర్జీ మండిపడుతున్నారు. బెంగాల్లో ఓడిన బీజేపీ కక్ష సాధింపుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసుగొల్పుతున్నదని ఆయన ఆరోపించారు. చట్టానికి కట్టుబడే పౌరుడిగా ఈడీ దర్యాప్తునకు తాను సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.