శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. మరోసారి పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్ (Kashmiri Pandit) మరణించాడు. పుల్వామా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుల్వామాలోని అచ్చన్ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే సంజయ్ శర్మ మరణించినట్లు చెప్పారు.
కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మృతుడు సంజయ్ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు చెప్పారు. అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఉగ్రవాదులు ఇటీవల కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన తొలి దాడి ఇది. అలాగే స్థానిక కశ్మీరీలను లక్ష్యంగా చేసుకున్న రెండో దాడి. ఇటీవల అనంత్నాగ్లో ఆసిఫ్ అలీ గనాయ్పై ఒక ఉగ్రవాది కాల్పులు జరుపడంతో అతడు గాయపడ్డాడు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అయిన ఆయన తండ్రి గత ఏడాది ఉగ్రవాదుల దాడిలో మరణించాడు.
కాగా, గత ఏడాది జమ్ముకశ్మీర్లో వరుస హత్యలు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారిలో చాలా మంది వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లే. దీంతో ఈ హత్యలపై కశ్మీరీ పండిట్లు భారీ స్థాయిలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను చంపేందుకే తిరిగి కశ్మీర్కు రప్పించారా అని ప్రశ్నించారు.
This is family of Bank security guard Sanjay Sharma who was killed by terrorists in Pulwama today. Blood continues to flow like water and no one gazes an eye. #Kashmir pic.twitter.com/HGW2Q3XBij
— Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) February 26, 2023