ముంబై : క్లాస్ రూంలో రెండవ తరగతి విద్యార్ధులు అందరూ కలిసి భేల్పురి తయారుచేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ముంబై స్కూల్ విద్యార్ధులు భేల్పురి చేసిన వీడియోను ఆర్జేఎఫ్ నాగ్రిక్సత్తా పేజ్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 10 మిలియన్ వ్యూస్ లభించాయి.
ఈ వైరల్ వీడియోలో పెద్ద పాత్రలో భేల్పురికి అవసరమైన పదార్ధాలను ఒకరి తర్వాత ఒకరు వేస్తుండటం కనిపించింది. ఓ విద్యార్ధి పాత్రలో ముర్మురాలను వేయగా మరికొందరు విద్యార్ధులు టమోటా, ఉల్లిగడ్డ, వేయించిన శనగలు, కొత్తమీర వేశారు.
ఓ చిన్నారి వీటిపై నిమ్మరసం చల్లగా మరో బాలుడు భేల్పురిపై ఉప్పు వేశాడు. ముంబైకి చెందిన లాల్జి త్రికంజీ ఎంపీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధులు భేల్పురి తయారుచేసినట్టు పోస్ట్ క్యాప్షన్ ద్వారా వెల్లడైంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ చిన్నారుల వంటకాన్ని ప్రశంసించారు.